jagananna sampoorna gruha hakku scheme

 




పథకం యొక్క ఉద్దేశం


  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నుంచి రుణం ద్వారా ఇల్లు కట్టుకున్న వారికి 'ఒన్ టైం సెటిల్మెంట్' ద్వారా ఇళ్ల పై పూర్తి హక్కులను కల్పిస్తూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందించే విధానమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం.

  •  రాష్ట్ర ప్రభుత్వం 1983-84 నుంచి 2017-18 మధ్య వివిధ గృహనిర్మాణ పథకాల ద్వారా దాదాపు 56 లక్షల ఇళ్లను మంజూరు చేసి పూర్తి చేయటం జరిగింది.

  • ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి స్థలానికి సంబంధించిన డి-పట్టాలు, పొసెషన్ సర్టిఫికెట్లు వంటి పత్రాలను తనఖా పెట్టిన మీదట వివిధ పథకాల కింద ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసింది.

  •  గడచిన కొన్నేళ్లలో కొద్దిమంది లబ్ధిదారులు మాత్రమే వారు తీసుకున్న గృహరుణాలకు సంబంధించిన అసలు, వడ్డీలను సకాలంలో చెల్లించి తమ డాక్యుమెంట్లను తీసుకున్నారు.

  • గడువులోగా చెల్లించలేని వివిధ గృహనిర్మాణ పథకాల లబ్దిదారులకు ఆయా రుణాలను మాఫీ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 'ఒన్ టైం సెటిల్ మెంట్' ని అమలు చేయనుంది.


పథకం వలన కలిగే ప్రయోజనాలు

  • 'ఒన్ టైం సెటిల్ మెంట్' ద్వారా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న గృహనిర్మాణ రుణానికి సంబంధించి చెల్లించాల్సిన అసలు, వడ్డీ బకాయిలన్నీ పూర్తిగా మాఫీ అవుతాయి

  • లబ్ధిదారులు తమ ఇంటి స్థలంపై  రిజిస్టర్డ్ డీడ్/పట్టా పొందుతారు. 

  • ఇంటి స్థలానికి సంబంధించి క్లియర్ టైటిల్ ను, పొసెషన్ ను రెవిన్యూ శాఖ జారీ చేస్తుంది. 

  • లబ్ధిదారులు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు/యాజమాన్యం/అనుభవం కలిగి ఉంటారు

  • లబ్ధిదారులు తమ ఇంటిని తనఖా పెట్టి రుణం పొందేందుకు కూడా అర్హత సాధిస్తారు.

ఒన్ టైం సెటిల్ మెంట్ రుసుము చెల్లింపు వివరాలు

  • గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000,

  • మునిసిపాలిటీల్లో రూ.15,000,

  • నగరపాలక సంస్థల పరిధిలో రూ.20,000

  • లబ్ధిదారులు పైన సూచించిన మొత్తాలను నవంబరు 7 నుంచి డిసెంబరు 15వ తేదీల మధ్య ఒన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

  • ఈ మొత్తాన్ని చెల్లించిన మీదట రెవెన్యూ అధికారులు లబ్దిదారులకు వారి ఇంటి స్థలాలను డిసెంబరు 21వ తేదీన సంబంధిత లబ్దిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి పట్టా అందజేస్తారు.

అర్హతలు:

  • రుణ గ్రహీతలు స్వతహాగా ఈ పథకాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా ఐచ్చికం (Optional). ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ సంస్థ నుంచి 1983-84 నుంచి 2017-18 మధ్య వివిధ పథకాల ద్వారా గృహనిర్మాణ రుణాలను పొందిన లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.

  • రుణాల చెల్లింపు గడువు మీరిన తర్వాత సంస్థకు బకాయిపడి వున్న వారంతా ఈ పథకం పరిధిలోకి వస్తారు.

  •  లబ్ధిదారుడు మరణించిన తర్వాత వారి వారసులు కూడా ఈ పథకాన్ని వినయోగించుకోనే అవకాశం ఉంది.

  • గృహనిర్మాణ సంస్థకు చెల్లించాల్సిన బకాయి మొత్తం అసలు, వడ్డీతో కలుపుకొని పైన ప్రభుత్వం నిర్ణయించిన స్లాబ్ విలువ కంటే తక్కువగా ఉన్నట్లయితే బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లించి ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు

  • ఉదా: గ్రామాల్లో స్లాబ్ విలువ రూ.10,000 అనుకుంటే సదరు లబ్ధిదారుడు తీసుకున్న ఋణం 3000 మరియు దానిపై వడ్డీ 2300 తో కలిపి వారు కట్టవలసిన మొత్తం 3000+230035300 మాత్రమే. 10 వేల రూపాయలు కాదు.

  • ఈ పథకం అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకొనేందుకు తమ సమీప సచివాల యాన్ని గానీ, వాలంటీరును గానీ సంప్రదించవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం:

  • గృహనిర్మాణ లబ్ధిదారుల గృహాలను వాలంటీర్లు సందర్శించి వారికి దరఖాస్తులు అందజేసి వాటిని పూర్తిచేయడంలో సహకరిస్తారు.

  • లబ్ధిదారులు తమకు అందజేసిన దరఖాస్తు పంపై సంతకం చేయడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తమ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. లేదంటే తమ గ్రామ/వార్డు సచివాలయం వద్దకు వెళ్లి ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.

  • లబ్ధిదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వి.ఆర్.ఓ., ఇంజనీరింగ్ సహాయకుడు క్లెయిమ్ లను క్షేత్రస్థాయి తనిఖీ చేసే నిమిత్తం సందర్శిస్తారు. 

  •  క్షేత్రస్థాయి తనిఖీల అనంతరం సిబ్బంది డిమాండ్ నోటీసులు తయారుచేస్తారు. ఆ డిమాండ్ నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని సంబంధిత లబ్ధిదారుడు తమ సమీప సచివాలయంలో గాని, వాలంటీరు ద్వారా గాని చెల్లించవచ్చు